ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అక్టోబర్ 3, గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసారు. అనంతరం జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరిని నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా సేవలందిస్తున్న జస్టిస్ మహేశ్వరిని పదోన్నతిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీనికి ప్రధాని మోదీ ఆమోదం అనంతరం, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేయడంతో ఏపీ హైకోర్టు తోలి పూర్తి స్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జేకే మహేశ్వరి నియామకం అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రభుత్వం తన నోటిఫికేషన్లో ప్రకటించింది. జస్టిస్ జేకే మహేశ్వరి ప్రమాణ స్వీకారం తేదీ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు చేసిన జనవరి 1, 2019 నాటి నుంచి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే)గా సేవలందిస్తూ వస్తున్నారు. ఇప్పుడు పూర్తి స్థాయి ప్రధాన న్యాయమూర్తి (సీజే) నియామకంతో జస్టిస్ ప్రవీణ్కుమార్ సీనియర్ న్యాయమూర్తిగా రెండో స్థానంలో కొనసాగుతారు. 1961 జూన్ 21న జన్మించిన జస్టిస్ జేకే మహేశ్వరి, 1985 నవంబర్ 22న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. తదనంతరం మధ్యప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టి సివిల్, క్రిమినల్, ఇతర రాజ్యాంగపరమైన వ్యవహారాల్లో న్యాయవాదిగా పనిచేసారు. 2005 నవంబర్ 25న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై, 2008లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు.
[subscribe]