జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 23, గురువారం ఉదయం పవన్ కళ్యాణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. ఆయనతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నేతల కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన జేపీ నడ్డాకు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ఇకపై జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఉమ్మడి కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. అలాగే రెండు పార్టీల పొత్తుకు సంబంధించి కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యుల ఎంపికపై కూడా చర్చలు జరిపినట్టు సమాచారం. మూడురాజధానుల అంశం, సీఆర్డీఏ రద్దు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను జేపీ నడ్డాకు పవన్ కళ్యాణ్ వివరించారు.
మరోవైపు ఫిబ్రవరి 2, ఆదివారం నాడు రాజధాని అమరావతి రైతులకు భరోసా ఇస్తూ భారీ కవాతు నిర్వహించాలని బీజేపీ, జనసేన పార్టీలు నిర్ణయించాయి. ఫిబ్రవరి రెండో తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రకాశం బ్యారేజీ వద్దగల సీతానగరం లాకుల నుంచి బందరు రోడ్డులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు భారీ కవాతు నిర్వహించాలని బీజేపీ- జనసేన పార్టీలు సంయుక్తంగా నిర్ణయించాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇతర పార్టీ సభ్యులతో కలిసి జనవరి 22న ఢిల్లీలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.
[subscribe]