ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా గురువారం రాత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సీఎం వైఎస్ జగన్ సుమారు గంటన్నర పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్రంలో వివిధ ప్రాంతాలమధ్య సమతుల్యతో కూడిన అభివృద్ధికి, అభివృద్ది వికేంద్రీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్షా కు సీఎం తెలియజేశారు. అందులో భాగంగానే రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరిస్తూ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును చేస్తూ ప్రణాళిక వేసుకున్నామని తెలిపారు. ఆగస్టు 2020న దీనికి సంబంధించి చట్టాన్నికూడా తీసుకొచ్చామని చెప్పారు. కర్నూలులో హైకోర్టును పెడుతూ రీ నోటిఫికేషన్ జారీచేయాలని కేంద్ర హోంమంత్రిని కోరారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు అంశాన్ని బీజేపీ కూడా పెట్టిందని సీఎం గుర్తు చేశారు.
అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. విభజన తర్వాత ఏర్పడ్డ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు కారణంగా రాష్ట్రం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని, రాష్ట్రాన్ని బలోపేతం చేయాలని, అనేక రంగాల్లో స్వయం సమృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడంద్వారా కేంద్ర గ్రాంట్లు అధికంగా రాష్ట్రానికి వస్తాయని, ఆర్థిక భారం తగ్గుతుందని వెల్లడించారు. భారీగా పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగాల కల్పన జరగాలన్నా ప్రత్యేక హోదా చాలా అవసరమని, అందువలన ప్రత్యేక హోదా ఇవ్వాలని మరోమారు విజ్ఞప్తి చేశారు.
కొత్తగా నిర్మించనున్న మెడికల్కాలేజీలకు మంజూరు, అనుమతులు, బియ్యం సబ్సిడీకింద రాష్ట్రప్రభుత్వానికి చెందిన సివిల్ సప్లైస్కార్పొరేషన్ లిమిటెడ్కు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ. 3,229 కోట్ల బకాయిలు విడుదల, గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.4,652.70 కోట్లు, ఉపాధి పనిదినాలను 100 నుంచి 150కి పెంచడం, స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధుల కింద రావాల్సిన రూ. 529.95 కోట్ల బకాయిలు, 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన పెండింగ్ లో మరో రూ.497 కోట్లు విడుదల, కుడిగి మరియు వల్లూరు థర్మల్ ప్లాంట్లనుంచి అధిక ధరకు కొనుగోలుచేస్తున్న విద్యుత్ను సరెండర్ చేసే విషయంలో తగిన చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై సీఎం వైఎస్ జగన్ అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ డిస్కంలనుంచి రావాల్సిన రూ.5,541.78 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, ఆత్మనిర్భర్ ప్యాకేజీ ద్వారా తెలంగాణ డిస్కంలకు తగిన రుణసదుపాయాలను కల్పించి, తద్వారా ఏపీ జెన్కోకు సెంట్రల్ డివల్యూషన్ నుంచి ఆ డబ్బు వచ్చేలా చూడాలని కోరారు. రాష్ట్ర విద్యుత్ రంగం దాదాపు రూ. 50వేల కోట్ల అప్పుల్లో ఉందని, ఈ రుణాలను రీ స్ట్రక్చర్ చేయాలని కోరారు. విశాఖ జిల్లా అప్పర్ సీలేరులో రివర్స్పంప్ స్టోరేజీ విద్యుత్ పాజెక్టుకు ఆర్థిక సహాయం, దిశ బిల్లుకు వెంటనే ఆమోదం తెలిపేలా చూడడం, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ బిల్లు–2020కి ఆమోదం, విజయనగరం జిల్లా సాలూరు సమీపంలో 250 ఎకరాల భూమిని గిరిజన విశ్వవిద్యాలయం కోసం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని వెంటనే యూనివర్శిటీని ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ