తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 97వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. “ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి, కోట్లాది సామాన్యులకు అండగా, నిలిచిన మేరునగ ధీరుడు నందమూరి తారకరామారావుగారు. ఎన్టీఆర్ అంటేనే ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శం. ఆయన కృషి, క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ది, దీక్షాదక్షత ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం. ఎన్టీఆర్ మానవతా దృక్పథం, సేవానిరతి, సామాజిక సంస్కరణాభిలాష, నమ్ముకున్న ప్రజలకు మంచి చేయడం కోసం ఎంతటికైనా తెగించగల సాహసం, తరతరాలకు ఆదర్శమే. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఆశయ సాధనకు పునరంకితమవుదాం. సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లని చాటుదామని” టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో పేర్కొన్నారు.
అలాగే గురువారం ఉదయం హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ప్రముఖ నటుడు బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచారని, ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని బాలకృష్ణ అన్నారు.
“తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం, తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం, నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం. వారితో కలిసి నటించడం నా అదృష్టం. పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటున్నానని” ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో పేర్కొన్నారు.
“సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్ళు అన్నది ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చాక పార్టీ కోసం అందించిన నినాదం కావచ్చు. కానీ అంతకుముందే తన జీవితమంతా ఈ మాటలను అక్షరాలా ఆచరించిన మానవతావాది ఎన్టీఆర్ గారు. ప్రజలకు అవసరమైనప్పుడల్లా తన వంతు సేవను, సహకారాన్ని అందించిన ప్రజాబంధువు ఎన్టీఆర్. బడుగులకు రాజకీయ అవకాశాలను పంచిన సమసమాజవాది. పేదలకు మెరుగైన జీవనాన్ని అందించిన సంక్షేమవాది. మహిళలకు సమాన హక్కులను కల్పించిన అభ్యుదయవాది. నందమూరి తారకరామారావుగారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుని కళాసేవను, ప్రజాసేవను స్మరించుకుని స్ఫూర్తిని పొందుదామని” టీడీపీ జనరల్ సెక్రెటరీ నారా లోకేష్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu