ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 31, శుక్రవారం నాడు క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో కరోనా నివారణా చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్నవారికి ప్లాస్మా థెరపీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్లాస్మా థెరపీపై అవగాహన కల్పించి, దీనివలన మంచి ఫలితాలు ఉంటే ప్రోత్సాహించాలని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. అలాగే ప్లాస్మా దానం చేసేవారికి 5 వేల రూపాయలు అందజేయండని అధికారులకు సూచించారు. మంచి భోజనం, వారి ఆరోగ్యం కోసం ఈ డబ్బు ఉపయోగపడుతుందని తెలిపారు.
కరోనా చికిత్స కోసం రాష్ట్రంలో ఎవరికీ బెడ్స్ దొరకలేదనే పరిస్థితి ఉండకూడదని అన్నారు. ఇప్పటికే కరోనా చికిత్స నిమిత్తం గుర్తించిన ఆస్పత్రులలో బెడ్ల ఖాళీలు, భర్తీల వివరాలు ఆస్పత్రి హెల్ప్ డెస్క్లో అందుబాటులో ఉంచాలన్నారు. ఆస్పత్రి వద్ద బ్లాక్ బోర్డులు ఏర్పాటు చేసి, బెడ్ల ఖాళీల వివరాలు, భర్తీ అయిన బెడ్స్ వివరాలు అందులో రాయాలని ఆదేశించారు. ఆసుపత్రికి చేరుకున్నప్పుడు ఎవరికైనా బెడ్ అందుబాటులో లేకపోతే, సమీప ఆస్పత్రికి పంపించి అక్కడ బెడ్ కేటాయించి చికిత్స అందించాలని సూచించారు. అలాగే చికిత్సలో భాగంగా అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu