మహానాడు విజయవంతం అయిన సంతోషంలో ఉన్న తెలుగు దేశం పార్టీ (టీడీపీ)కి షాక్ గురువారం తగిలింది. ప్రముఖ నటి, ఆ పార్టీకి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న దివ్యవాణి ఈరోజు రాజీనామా చేశారు. అయితే దివ్యవాణి పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయిన తర్వాతి రోజే ఈ ప్రకటన చేయడం విశేషం. పార్టీలో తాను పడుతున్న ఇబ్బందులను అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేకుండా పోయిందని వాపోయారు. ఈ క్రమంలో తన వ్యవహారంలో విమర్శలు, విశ్లేషణలు చేసిన వారందరికీ కృతజ్ఞతలు అని అన్నారు. ప్రస్తుతం తాను ఏ పార్టీలో లేనని, భవిష్యత్తులో ఏ పార్టీలో చేరతానో ఇప్పుడే చెప్పలేనని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో.. ఆమె గురువారం విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి టీడీపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీలో తనకెదురైన అవమానాలను గుర్తుచేసుకున్నారు. నిస్వార్థ సేవను పార్టీ గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీలో గతేడాదిగా నాకు ప్రాధాన్యత లేదని, పార్టీలో బాలకృష్ణ కన్నా తానే ఎక్కువ కష్టపడ్డానని తెలియజేశారు. పార్టీలో తాను ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్లానని, అయినా పార్టీలో తనకు సరైన న్యాయం జరగలేదని కన్నీళ్లపర్యంతం అయ్యారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, అయితే ఆయన చుట్టూ ఒక నలుగురు పెద్దలు కోటరీగా ఏర్పడ్డారని, వారే ఆయనను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.
కాగా దీనిపై గడచిన రెండు, మూడు రోజులుగా ఆమె దీనిపై సోషల్ మీడియా ద్వారా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు దివ్యవాణి ట్వీట్ చేశారు. ఓ కళాకారుడు (ఎన్టీఆర్) స్థాపించిన పార్టీలో కళాకారులకు స్థానం లేకపోవడం తనను చాలా ఆవేదనకు గురి చేసిందని వ్యాఖ్యానించారు. ఇన్ని రోజులు తాను అధికారం లేని అధికార ప్రతినిధిగానే పార్టీలో ఉన్నానని వెల్లడించారు. ఇప్పటి వరకు నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఆ ట్వీట్ను తొలగించారు. ఈ క్రమంలో దివ్యవాణి నిన్న రాత్రి చంద్రబాబుని కలిశారు. కానీ ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF