విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్లో దేశ తొలి విద్యాశాఖ మంత్రి భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరం జాతీయ విద్యాదినోత్సవంగా జరుపుకునే ఈ రోజున రాష్ట్రంలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలో విద్యాసంస్థల అభివృద్ధి కోసం అబుల్ కలాం ఆజాద్ చేసిన కృషిని, 1947 నుంచి 1958 వరకు విద్యాశాఖ మంత్రిగా ఆయన అందించిన విశేషమైన సేవలను కొనియాడారు. అదే విధంగా ప్రపంచంతో పోటీ పడే స్థాయికి రాష్ట్రంలోని పిల్లలు ఎదగాలంటే, అది ఒక్క ఇంగ్లీషు మీడియం పాఠశాలలతోనే సాధ్యమని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. మొదటి విడతగా 1 నుంచి 6వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలోనే భోధన చెయ్యాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారిపై ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ విమర్శలు కురిపించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీనటుడు పవన్ కళ్యాణ్ వంటి వారు చాలా దారుణంగా మాట్లాడారని, మన పిల్లలకు మంచి చేస్తే విమర్శలు ఎందుకని ప్రశ్నించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవళ్లు ఏ స్కూల్లో చదువుతున్నారో చెప్పాలి? అలాగే యాక్టర్ పవన్ భార్యలకు నలుగురు పిల్లలు, వాళ్లు ఏ స్కూల్లో చదువుతున్నారని సీఎం వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలోని పిల్లలకి ఉన్నత చదువులు అందించాలని అనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుంటే, ప్రతిపక్ష నాయకులు బుదరజల్లడం దారుణమన్నారు. వచ్చే విద్యా సంవత్సరం మొదలు ప్రతి సంవత్సరం ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లీష్ మీడియంగా మారుస్తూ తెలుగు, ఉర్దూ బాషను సబ్జెక్టు గా తప్పనిసరి చేస్తామని చెప్పారు. ముందుగా 1 నుంచి 6వ తరగతి వరకు పూర్తిగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి, తరువాత సంవత్సరాలలో వరుసగా ఒక్కో క్లాసు పెంచుకుంటూ 7, 8, 9, 10 తరగతులలో కూడ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతామని చెప్పారు. నవంబరు 14న స్కూళ్లలో నాడు-నేడు కార్యక్రమం మొదలు పెట్టి దశలవారీగా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మారుస్తామని తెలిపారు. అలాగే రాష్ట్రంలో మదర్సా బోర్డు ఏర్పాటుకు కూడ ఆదేశాలు జారీ చేస్తున్నామని చెప్పారు.
[subscribe]