తెలంగాణ రాష్ట్ర ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కే టి రామారావుకు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. ఈసారి ఆస్ట్రేలియా నుంచి అక్కడ జరిగే ఆస్ట్రేలియా-ఇండియా లీడర్ షిప్ సదస్సులో పాల్గొనాల్సిందిగా మంత్రి కేటీఆర్ కి ప్రత్యేక ఆహ్వానం అందింది. డిసెంబర్ 8-9 తేదీల్లో ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ వేదికగా జరిగే నాలుగో ఆస్ట్రేలియా-ఇండియా లీడర్ షిప్ సదస్సులో పాల్గొనాలని నిర్వాహకులు ఆహ్వానం పంపడం జరిగింది. ఈ సదస్సుకు రెండు దేశాలకు చెందిన వ్యాపార, వాణిజ్య మరియు ప్రభుత్వ రంగంలోని ప్రభావశీల, నిర్ణయాత్మక ప్రతినిధులు హాజరవుతారు. ఆస్ట్రేలియా-ఇండియా సంబంధాలు, వివిధ ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యాలు, ఆర్థిక ఒప్పందాలు, వ్యాపార వాణిజ్య రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాల బలోపేతం దిశగా చేపట్టవలసిన కార్యాచరణకు సంబంధించి ఈ సదస్సులో చర్చిస్తారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి అత్యధిక శాతం మంది విద్యార్థులు ఆస్ట్రేలియా విద్యాసంస్థలను తమ వీదేశీ విద్య కోసం ఎంచుకుంటున్న నేపథ్యంలో విద్యా, టెక్నాలజీ రంగంలో ఉన్న ఉపాధి మరియు పెట్టుబడి అవకాశాల గురించి చర్చించే అవకాశం ఉంటుందని అని మంత్రి కేటీఆర్ కు పంపిన లేఖలో ఆస్ట్రేలియా-ఇండియా లీడర్ షిప్ సదస్సు నిర్వాహకులు తెలిపారు.
[subscribe]