ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 28, శుక్రవారం నాడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను సీఎం పరిశీలిస్తారు. సీఎం వైఎస్ జగన్ పోలవరం పర్యటన నేపథ్యంలో ప్రాజెక్టు సంబంధిత అధికారులతో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ మంగళవారం నాడు సమీక్షా సమావేశం నిర్మించారు. విజయవాడలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి పోలవరం ప్రాజెక్టు సీఈ సుధాకర్బాబు, ఈఎన్సీ నారాయణరెడ్డి, సహాయ, పునరావాస శాఖ కమిషనర్ బాబూరావు తదితరులు హాజరయ్యారు.
పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికను సమర్థవంతంగా అమలు అయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ప్రాజెక్టు నిర్మాణ పనులు, పునరావాస ప్యాకేజీలో అంశాలపై అధికారులతో చర్చించారు. ముంపు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా అధికారులకు స్పష్టం చేశారు. రోజువారీగా జరిగే ప్రాజెక్టు పనుల పురోగతిని తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఒక యాప్ను తయారు చేసి, అందులో పొందుపర్చాలని మంత్రి అనిల్కుమార్ అధికారులను ఆదేశించారు.
[subscribe]