పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పై ఈశాన్య ఢిల్లీలో జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు 18 మంది మృతి చెందినట్టుగా ఢిల్లీలోని గురు తేగ్ బహదూర్(జీటీబీ) ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అలాగే 56 మంది పోలీసు సిబ్బందితో సహా 180 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తుంది. పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వీధుల్లో పెద్దఎత్తున మోహరించారు. హత్య, అల్లర్లు, కాల్పులు జరపడం, ప్రజా, ప్రభుత్వ ఆస్తులను నాశనం చేయడం వంటి ఆరోపణలపై పోలీసులు ఇప్పటికీ 11 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. ఈశాన్య ఢిల్లీలోని మౌజ్పూర్, చాంద్బాగ్, గోకుల్పురి, జఫ్రాబాద్, కర్వాల్ నగర్ తదితర ప్రాంతాల్లో పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో పూర్తి స్థాయిలో కర్ఫ్యూ విధించారు.
మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం నాడు తాజా పరిస్థితులపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ తో వేర్వేరుగా సమావేశమై చర్చించారు. అలాగే ఢిల్లీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలను అదుపులోకి తెచ్చే బాధ్యతను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవాల్ కు అప్పగించినట్టు సమాచారం. ఈ రోజు జరగనున్న కేబినెట్ భద్రతా కమిటీ సమావేశం సందర్భంగా ఢిల్లీలోని పరిస్థితులను ప్రధాని మోదీకి, కేబినెట్కు అజిత్ డోవాల్ వివరించనున్నారు. అజిత్ డోవాల్ మంగళవారం రాత్రి జాఫ్రాబాద్, సీలాంపూర్ తో పాటుగా ఈశాన్య ఢిల్లీలోని పలు ప్రభావిత ప్రాంతాలను సందర్శించి తాజా పరిస్థితులను సమీక్షించారు. ఘర్షణల నేపథ్యంలో ఈశాన్య ఢిల్లీలోని పాఠశాలన్నింటినీ కొన్నిరోజుల పాటు మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ప్రకటన విడుదల చేశారు. అలాగే ఈ రోజు జరిగే సీబీఎస్సీ పరీక్షలన్నింటినీ వాయిదా వేయాలని బోర్డును కోరినట్లు మనీశ్ సిసోడియా తెలిపారు.
[subscribe]