ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 11,158 రైతు భరోసా కేంద్రాలును ఏర్పాటు చేసి, గ్రామ సచివాలయ వ్యవస్థతో సమన్వయంగా పనిచేసేలా ఏర్పాట్లు చేయాలని ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫిబ్రవరి 6, గురువారం నాడు అగ్రి మిషన్, కొనుగోలు కేంద్రాల తీరు, రైతులకు లభిస్తున్న ధరలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాల కొనుగోలు కోసం బుకింగ్ చేసుకునే వెబ్సైట్ను సీఎం ప్రారంభించారు. అలాగే రైతు భరోసా కేంద్రాల లోగోను కూడా సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో కొనుగోలు కేంద్రాలు మరింత సమర్థవంతంగా నడవడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన ధరల పట్టిక ఉంచాలని ఆదేశించారు. పంటను అమ్ముకునే విషయంలో రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికావద్దని సీఎం స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర మంత్రులు కురసాల కన్నబాబు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాస్, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, సీఎస్ నీలం సాహ్ని తదితరులు పాల్గొన్నారు.
[subscribe]