ఫిబ్రవరి 9, ఆదివారం నాడు జరగబోయే ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. మొదటి సెమీఫైనల్లో పాకిస్తాన్ పై ఘనవిజయం సాధించిన భారత్ జట్టు ఫైనల్ కు చేరుకోగా, గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ పై బంగ్లాదేశ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్స్ కు చేరుకుంది. సెమీస్ లో బంగ్లాదేశ్ గెలవడంతో దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ లో టైటిల్ కోసం రెండు ఆసియా జట్లే పోటీ పడనున్నాయి. ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో భారత్ జట్టు ఇప్పటికే నాలుగు సార్లు చాంపియన్గా నిలవగా, బంగ్లాదేశ్ తొలిసారిగా ఈ టోర్నమెంట్ ఫైనల్లోకి అడుగు పెట్టింది.
ఫిబ్రవరి 6, గురువారం నాడు జరిగిన మ్యాచ్ లో ముందుగా టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ యువ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్ 44.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 6 వికెట్లతేడాతో విజయం సాధించింది. వన్డౌన్ లో వచ్చిన బంగ్లా బ్యాట్స్మన్ మహ్మదుల్ హసన్ జాయ్ (100:13×4) శతకంతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తౌహిద్ హృదోయ్(40: 4×4), షహదత్ హొసేన్(40*: 4×4) కూడా తమ వంతు సహకారం అందించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టులో బెఖమ్ వీలర్ గ్రినైల్ (75:5×4, 2×6), నిక్ లిడ్స్టోన్(44:2×4), ఫెర్గుస్ లేల్మాన్(24:3×4)మాత్రమే రాణించగా, మిగతా బ్యాట్స్మన్ పూర్తిగా విఫలమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో షోరిఫుల్ ఇస్లామ్(3), షమిమ్ హొసేన్(2), హసన్ మురద్(2) వికెట్లు తీసి న్యూజిలాండ్ ఆటగాళ్లను కట్టడి చేశారు.