ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రభుత్వం ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, ఫిబ్రవరి 24వ తేదీన విజయనగం జిల్లాలో జగనన్న వసతి దీవెన పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ముందుగా సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్న ప్రాంతాలు, సభా వేదిక ఏర్పాట్లను మంత్రి బొత్స సత్యనారాయణ పర్యవేక్షించారు. అనంతరం విజయనగరం కలెక్టరేట్లో ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణితో కలిసి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ, జగనన్న వసతి దీవెన లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా నుంచి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక వైఎస్ జగన్ తొలిసారిగా జిల్లా పర్యటనకు వస్తున్న తరుణంలో ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు ఈ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేస్తున్న దిశా పోలీస్ స్టేషన్ను కూడా సీఎం ప్రారంభించనున్నట్లు మంత్రి బొత్స పేర్కొన్నారు. అలాగే టీడీపీ చేపట్టిన ప్రజా చైతన్య యాత్రపై విమర్శలు గుప్పించారు. ప్రజా చైతన్య యాత్ర పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని మంత్రి బొత్స మండిపడ్డారు.
[subscribe]