ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో (ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, కుప్పం, బుచ్చిరెడ్డిపాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ)లలో సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 325 డివిజన్/వార్డు స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా, మొత్తం 1,206 మంది బరిలో నిలిచారు. ఎన్నికల నిర్వహణ కోసం 908 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. కాగా ప్రజలు ఉదయం నుంచే పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మరోవైపు ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే నవంబర్ 15వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. ఇక నవంబర్ 17వతేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు.
ఇక ఈ ఎన్నికల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపాలిటీపై ప్రత్యేక ఆసక్తి నెలకుంది. ఈ స్థానంలో అధికార వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు నెలకుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ సరళిపై కుప్పం టీడీపీ నాయకులతో సోమవారం ఉదయం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మరోవైపు ఆయన కుప్పం చేరుకొని, పోలింగ్ సరళిని స్వయంగా పర్యవేక్షించనున్నట్టు తెలుస్తుంది. కుప్పం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులకు పోలింగ్ జరుగుతుండగా, 48 పోలింగ్ కేంద్రాల్లో 39,261 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు భారీగా ఏర్పాటు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ