ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ అయ్యారు. గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా ఆయన్ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ పేరుతో ఈ ఉత్తర్వులు జారీ చేసారు. సీఎస్ గా తన బాధ్యతలను తక్షణమే సీసీఎల్ కి అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరో ఐదునెలల పాటు ఎల్వీ సుబ్రహ్మణ్యంకు సర్వీసు ఉండగానే బదిలీ చేయడంతో అధికార యంత్రాంగంలో చర్చనీయాంశమయింది. కేబినెట్ అజెండాలో చర్చించే అంశాలను సీఎస్ ఆమోదం లేకుండా అజెండాలో పెట్టిన విషయంపై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ కి రెండ్రోజుల క్రితం ఎల్వీ సుబ్రహ్మణ్యం షోకాజ్ నోటీస్ జారీ చేశారు. దీనిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో జరిగిన విషయాలే ఎల్వీ సుబ్రహ్మణ్యంపై బదిలీ వేటుకు దారితీశాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఇన్చార్జ్ సీఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ కొనసాగనున్నారు.
[subscribe]