నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బోనిగి ఆనందయ్య పంపిణీ చేసిన మందుపై పరిశోధనలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆనందయ్య మందును పంపిణీ చేసేందుకు అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆనందయ్య మందు పంపిణీపై జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ (సీసీఆర్ఏఎస్) కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఆనందయ్య ఇస్తున్న కళ్ళలో వేసే డ్రాప్స్, కే రకం మందు తప్ప, మిగతా పీ, ఎల్, ఎఫ్ మందులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కళ్ళలో వేసే డ్రాప్స్ మందుకు సంబంధించిన పరిశోధన పూర్తి నివేదిక ఇంకా రావాల్సి ఉందని, నివేదిక వచ్చేందుకు 2-3 వారాలు సమయం పడుతుందని ప్రభుత్వం తెలిపింది.
ఆనందయ్య మందు వాడితే కరోనా తగ్గుతుందని చెప్పేందుకు కచ్చితమైన ఆధారాలు, నిర్ధారణ లేవని పేర్కొన్నారు. అలాగే కరోనా బారినపడిన వారు వైద్యులు సూచించిన మందులు వాడుతూనే, ఈ ఆయుర్వేద మందును తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ మందు వాడుతున్న కారణంతో కరోనా చికిత్సకు మిగతా మందులు వాడకుండా ఉండొద్దని చెప్పారు. ఇక ఆనందయ్య మందు తీసుకునేందుకు కృష్ణపట్నానికి కరోనా బాధితులు వెళ్లోద్దని, వారి కుటుంబ సభ్యులు లేదా బంధువులు వెళ్లాలని సూచించారు. కృష్ణపట్నంలో ఈ మందు పంపిణీ కేంద్రాల వద్ద అన్ని కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ