ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా మే 5 నుంచి కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ (సెక్షన్ 144) అమలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే దుకాణాలకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. అయితే మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలవుతున్న నేపథ్యంలో ఉద్యోగులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల పని వేళల్లో మార్పులు చేశారు. అన్ని శాఖలు, సెక్రటేరియట్, హెడ్ఓడి, జిల్లా, సబ్ డివిజన్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులంతా ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకే పనిచేయాలని ఆదేశాలు ఇచ్చారు.
కాగా కరోనా నియంత్రణలో అత్యవసర సేవలు అందిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ, మునిసిపల్ పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఇంధన శాఖలకు ఈ పని వేళలు వర్తించవని పేర్కొన్నారు. ఇక ఎవరైనా ఉద్యోగులు మధ్యాహ్నం 12 గంటల తర్వాత కార్యాలయాల్లో ఉండాలంటే వారు కచ్చితంగా ప్రత్యేక పాసులు కలిగి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. విభాగాల పనిని బట్టి ఎంత మంది ఉద్యోగులు మధ్యాహ్నం 12 గంటల తర్వాత కూడా కార్యాలయాల్లో ఉండాలో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాధ్ దాస్ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగుల పనివేళలు మార్పుపై జారీచేసిన ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ