ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకు వ్యాప్తి చెందుతుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40కు చేరుకుంది. గడిచిన 12 గంటల్లోనే కొత్తగా 17 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్రంలో లాక్ డౌన్ అమలుచేయడంతో పాటుగా, రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు సేవలు అందించేలా ప్రైవేట్ ఆస్పత్రులు సైతం సిద్ధం కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
జాతీయ విపత్తుల నివారణ చట్టం మరియు అంటువ్యాధుల నివారణ చట్టం 1897 ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, ప్రైవేట్ పరిధిలోని వైద్య కళాశాలలు, నర్సింగ్ హోంలు, ట్రస్ట్ల పేరుతో నిర్వహిస్తున్న ఆస్పత్రులను ప్రభుత్వ పరిధిలోకి తెస్తూ ఇకపై ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేయాల్సి ఉంటుందని ఆదేశాలు ఇచ్చారు. ముందుగా తొలిదశలో భాగంగా 450 ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.కె.ఎస్.జవహర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఏర్పడ్డ క్రమంలో కరోనా బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించాలనే ప్రభుత్వ లక్ష్యంతోనే, చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రులను కూడా తీసుకోవాలని నిర్ణయించామని జవహర్రెడ్డి తెలిపారు.