ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 20, బుధవారం నాడు ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో ఐటీ కార్యకలాపాలు, అందుకు సంబంధిత పరిశ్రమల కోసం మూడు ప్రాంతాల్లో కాన్సెప్ట్ సిటీలను తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విశాఖపట్నం, తిరుపతి మరియు అనంతపురం ప్రాంతాల్లో కాన్సెప్ట్ సిటీల ఏర్పాటుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు. ముందుగా 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ కాన్సెప్ట్ సిటీలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడులుపెట్టే పరిశ్రమలకు అనుమతులు వేగంగా ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని, అంతేగాక రాష్ట్రానికి వచ్చే సంస్థలకు ప్రోత్సాహక ధరలతో భూములు, నీరు, విద్యుత్ ఇస్తామని సీఎం జగన్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా అమలులోకి వచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలను సమాచార సాంకేతిక వ్యవస్థతో అనుసంధానించే అంశంపై సీఎం జగన్ అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామాలలోని ఈ వ్యవస్థలతో నేరుగా జిల్లా కలెక్టర్లకు, రాష్ట్ర సచివాలయానికి అనుసంధానం ఉండాలని చెప్పారు. అందుకు సంబంధించిన సమాచార సాంకేతిక వ్యవస్థను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. రేషన్, పింఛను, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ కార్డులను గ్రామ సచివాలయాల్లోనే ముద్రించి ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. గ్రామసచివాలయాలకు వచ్చే వినతులు ఏ దశల్లో ఉన్నాయో ఆన్ లైన్ లో చూసే అవకాశం ఉండాలని చెప్పారు. ఈ వ్యవస్థలకు నిర్దేశించిన లక్ష్యాలు నెరవేరాలంటే అందుకు తగిన బలమైన ఐటీ వ్యవస్థ ఉండాలని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
[subscribe]