ఆంధ్రప్రదేశ్ లో పెగాసస్ వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది. గత కొన్ని నెలల క్రితం అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో పెగాసస్ స్పైవేర్ను ఉపయోగించినట్లుగా వార్తలు, ఆరోపణలు వినిపించాయి. ఈ స్పైవేర్ ద్వారా రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీలు మరియు ఇతర ప్రముఖులపై ప్రభుత్వం నిఘా పెట్టిందన్న ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు స్పీకర్ తమ్మినేని సీతారాం.. భూమన కరుణాకర్ రెడ్డిని చైర్మన్గా నియమిస్తూ, ఐదుగురితో శాసనసభా సంఘం (హౌస్ కమిటీ) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై విచారణ చేపట్టేందుకు ఈ హౌస్ కమిటీ మంగళవారం అసెంబ్లీలో సమావేశమైంది. ఈ సందర్భంగా వారు ఫోన్ ట్యాపింగ్, నిబంధనలకు విరుద్ధంగా రహస్య పరికరాల కొనుగోలుకు సంబంధించి పూర్తి వివరాల కోసం సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.
ఈ సమావేశం అనంతరం హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ హయాంలో వ్యక్తుల, పార్టీల సమాచారాన్ని నిబంధనలకు విరుద్ధంగా పొందే ప్రయత్నం చేసిందని తెలిపారు. దీనిలో భాగంగా పెగాసస్ స్పైవేర్ ద్వారా సమాచారం సేకరించినట్లు అనుమానాలున్నాయని, దీనిపై శాసన సభలో చర్చించిన మీదట సభ ఆమోదంతో స్పీకర్ కమిటీ వేశారని గుర్తు చేశారు. ఈ అంశంపై విచారించేందుకు ఈరోజు సమావేశమయ్యామని, అయితే ప్రస్తుతం దీనిపై ప్రాథమిక విచారణ మాత్రమే జరిగిందని వెల్లడించారు. తదుపరి సమావేశంలోపు పెగాసస్కి సంబంధించి పూర్తి సమాచారం సేకరిస్తామని, అప్పుడు దీనిపై వివరిస్తామని తెలిపారు. ఈ సమావేశానికి హౌస్ కమిటీ సభ్యులు కరణం ధర్మశ్రీ, భాగ్యలక్ష్మి, జగన్మోహన్ రావు, మద్దాళి గిరిధర్ హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ