ఆంధ్రప్రదేశ్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వరదలు తగ్గిన తర్వాత చంద్రబాబు పర్యటన పెట్టుకున్నారని, ప్రజలను రెచ్చగొట్టడానికే ఆయన ఇప్పుడు పరామర్శకు వెళుతున్నారని మండిపడ్డారు. అయినా ఇప్పుడు ఆయన వెళ్లి అక్కడ చేయగలిగేది ఏముంటుందని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ముందుచూపు లేకుండా తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వల్లే పోలవరం ప్రాజెక్టులో భాగమైన లోయర్ కాఫర్ డ్యామ్ మునిగి పోయిందని, రూ. 400 కోట్లతో కట్టిన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని మంత్రి అంబటి తీవ్ర విమర్శలు చేశారు.
స్పిల్వేను మధ్యలో ఆపేసి డయాఫ్రమ్ వాల్ నిర్మించడం, అలాగే కాఫర్డ్యామ్ పూర్తికాకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టడమే దీనికి నిదర్శనమని మంత్రి అంబటి పేర్కొన్నారు. సాధ్యమైనంత తొందరలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, దీనిలో భాగంగానే పోలవరం వద్ద పునాధులతో ఉన్న స్పిల్వేను, అప్రోచ్వేను పూర్తి చేశామని తెలిపారు. ఇక మరోవైపు తెలంగాణ మంత్రులు అవగాహాన లేకుండా పోలవరంపై మాట్లాడుతున్నారని, ప్రాజెక్టుకు సంబంధించి సిడబ్ల్యూసి నుంచి అన్ని డిజైన్లకు అనుమతులు వచ్చాకే నిర్మాణం చేపట్టామని అంబటి స్పష్టం చేశారు. అలాగే ఇటీవల వచ్చిన భారీ వరదల నేపథ్యంలో ప్రాజెక్టు నుంచి 26 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశామని మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ