ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు చేపట్టిన రివర్స్ టెండరింగ్ తో ఇప్పటివరకు జలవనరుల శాఖలో రూ.1000 కోట్లు ఆదా చేశామని ఆ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. అక్టోబర్ 21, సోమవారం నాడు తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ చేపడుతుంటే టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని, రివర్స్ టెండరింగ్ చేయకపోతే ఈ డబ్బంతా ఎవరి చేతుల్లోకి వెళ్లేదని ప్రశ్నించారు. వెలిగొండలో ఈ విధానం ద్వారా రూ.61 కోట్లు ఆదాయం వచ్చిందని, రాబోయే రోజుల్లో మరో రూ.500 కోట్లు మిగులుతాయని భావిస్తున్నామని చెప్పారు. ఇలా మిగిలిన డబ్బుతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పేద ప్రజలను ఆదుకోవచ్చని చెప్పారు.
కృష్ణా, గోదావరి నదులకు వరదలు రావడం వలనే రాష్ట్రంలో ఇసుకకు తాత్కాలికంగా కొంత ఇబ్బంది ఏర్పడిందని మంత్రి అనిల్ కుమార్ చెప్పారు. రాష్ట్రంలో త్వరలోనే ఇసుక కొరతను తీరుస్తామని అన్నారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాలుగు నెలలకే ఏ పనులు చేయట్లేదని విమర్శిస్తున్నారని, గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు కూడ ఏ ప్రాజెక్టు చేపట్టలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ నాయకులు అనవసరంగా విమర్శలు చేస్తున్నారని మంత్రి అనిల్ మండిపడ్డారు. రాష్ట్రం ఎదురుకుంటున్న పలు సమస్యల పరిష్కారం కోసమే , కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి కలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
[subscribe]