విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి స్టెరైన్ గ్యాస్ లీకేజ్ వలన తీవ్ర అస్వస్థతకు గురై 12 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 500 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఇటీవలే గ్యాస్ లీక్ దుర్ఘటనను హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారించింది. ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ ప్రాంగణాన్ని సీజ్ చేసి ఉంచాలని, కంపెనీలోకి ఎవరినీ అనుమతించొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే అనుమతి లేకుండా కంపెనీ డైరెక్టర్లు దేశం విడిచి వెళ్లొద్దని, కంపెనీ డైరెక్టర్లు వారి పాస్పోర్టులు స్వాధీనపరచాలని కోర్టు పేర్కొంది.
ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలపై ఎల్.జి.పాలిమర్స్ యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్పై ఈ రోజు విచారణ చేపట్టింది. ప్రస్తుతం ప్లాంట్లో పరిస్థితుల దృష్ట్యా లోపలికి వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరింది. అదే విధంగా ఈ ఘటనపై విచారణ కోసం ఏడు కమిటీలు నియమించడంతో దేనికి హాజరుకావాలో సందిగ్ధ పరిస్థితి నెలకొని ఉందని ఎల్.జి.పాలిమర్స్ విచారణ సందర్భంగా కోర్టు దృష్టికి తెచ్చింది. అయితే ఈ పిటిషన్పై తదుపరిగా విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. ఈ ఘటనపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) లేదా రాష్ట్ర హైకోర్టు పూర్తిస్థాయిలో విచారణ చేపడతాయని ధర్మాసనం వెల్లడించింది. ఎన్జీటీ, హైకోర్టులలో విచారణ ముగిసాక మాత్రమే సుప్రీంకోర్టుకు రావాలని ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు జూన్ 1 వ తేదీన ఎల్.జి.పాలిమర్స్ ఘటనపై ఎన్జీటీలో విచారణ జరిగే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu