సినిమా టికెట్ల బుకింగ్ కోసం ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి తీసుకువచ్చే విషయంపై ఏపీ ప్రభుత్వం ఇటీవలే కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల పోర్టల్ అంశంపై ఏపీ మంత్రి పేర్ని నాని మంగళవారం మీడియా సమావేశంలో స్పందించారు. సినిమా టికెట్ల అమ్మకం విషయంలో తప్పుడు ప్రచారం మానుకోవాలని ప్రతిపక్ష నేతలకు సూచించారు. ఆన్లైన్ విధానం ద్వారా సినిమా టిక్కెట్ల అమ్మకం జరపాలని సినీ ప్రముఖులే కోరారని, సినీ పెద్దల సూచననే ప్రభుత్వం పరిశీలించిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ విషయంలో పన్ను ఎగవేత జరుగుతుండడాన్ని ప్రభుత్వం గమనించిందన్నారు. థియేటర్ల వద్ద బ్లాక్ టిక్కెట్లు లేకుండా అరికట్టడం, ప్రజలకు మేలు చేసేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు.
ముందుగా రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్లను, ఇష్టమొచ్చినట్టు షోలు వేయడాన్ని నియంత్రిస్తూ ఏప్రిల్ 8వ తేదీన ఇచ్చిన జీవో ఇచ్చినట్టు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే టికెట్స్ విక్రయం జరిపేలా ఆదేశాలిచ్చామన్నారు. ఆన్లైన్ టికెట్ బుకింగ్ విధానంపై అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు చేశామని, దీనిపై అధ్యయనం జరుగుతుందన్నారు. వెంటనే ఈ విషయంపై అర్ధం లేని విధంగా పెద్ద ఎత్తున విమర్శలు మొదలు పెట్టారని చెప్పారు. ప్రభుత్వ ఆలోచనను అర్ధం చేసుకోవాలని కోరారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ నేతృత్వంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, సినిమా హాళ్ల యాజమాన్యాలతో త్వరలో సమావేశం జరుపుతామని మంత్రి తెలిపారు. అదే విధంగా పలు అంశాలపై సినీ ఇండస్ట్రీ పెద్దలు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అవుతామని కోరారని, ఆగస్టులో సమావేశం కావాలని భావించినా కుదర్లేదని అన్నారు. త్వరలోనే సినీ పెద్దలు సీఎం వైఎస్ జగన్ తో భేటీ కానున్నారని తెలిపారు. సినిమా టికెట్ల విషయంలో ప్రజలకు మంచి చెయ్యడం కోసమే ప్రభుత్వం ఆలోచన చేస్తుందని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ