తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించటానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని, అయితే అదే రోజు (మార్చి 29) చంద్రబాబు పాలనలోని లోపాలను రాష్ట్ర ప్రజలకు వివరిస్తానని అంబటి చెప్పారు. శనివారం సాయంత్రం వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వలన ప్రజలలో ఆయనపై అభిమానం రోజు రోజుకూ పెరుగుతోందని.. దీని చూసి టీడీపీ భయపడుతోందని, అందుకే చంద్రబాబు రోజుకొక సమస్యను సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. తమ ప్రభుత్వ పాలనలో జరిగిన మంచితో పాటు టీడీపీ పాలనలో జరిగిన అవకతవకల గురించి చర్చ జరగాలని అంబటి అన్నారు.
ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక మద్యపాన నిషేధం విధిస్తే, చంద్రబాబు వచ్చాక దానిని ఎత్తేశాడని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి ఇప్పుడు సీఎం జగన్ మద్యాన్ని నియంత్రిస్తున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను చంద్రబాబు నీరుగార్చారని విమర్శించారు. టీడీపీ పాలనలో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక్క సంస్కరణ అయినా జరిగిందా అని ప్రశ్నించారు. సీఎం జగన్ పాలనలో రెండున్నరేళ్లలోనే ఎన్నో గొప్ప సంస్కరణలు జరిగాయి. ఎవరి ప్రభుత్వంలో అవినీతి జరిగింది.. ఎవరి ప్రభుత్వంలో సంస్కరణలు జరిగాయి అనే విషయమై బహిరంగ చర్చకు సిద్ధమని, కావాలంటే చర్చకు నారా లోకేష్ను పంపినా ఫర్వాలేదని వెల్లడించారు. ఎవరు ఎన్ని రకాలుగా అడ్డుకున్నా.. ఉగాది నుంచి కొత్త జిల్లాలు ఏర్పడతాయని, వాటినుంచే పాలన సాగుతుందని తెలిపారు. మూడు రాజధానులతో రాష్ట్రమంతా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని స్పష్టం చేసారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ