ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు జిల్లాల మధ్య ఉన్న ప్రయాణ ఆంక్షలను పోలీసులు సడలించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఏ జిల్లాకు వెళ్లాలన్నా కూడా పోలీసుల నుంచి అనుమతి, మరియు ఈ-పాస్ ఉంటేనే వెళ్లనిచ్చారు. అయితే మే 23 శనివారం నుంచి ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లేందుకు ఎటువంటి అనుమతి (పాస్) అవసరం లేదని, అవసరాన్ని బట్టి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లవచ్చని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆంక్షలను సడలిస్తూ డీజీపీ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.
అయితే ప్రయాణాల సందర్భంగా ప్రజలు నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. జిల్లాలో అయినా, వేరే జిల్లాకి అయినా అత్యవసరమైతేనే వెళ్ళాలని సూచించారు. కారులో డ్రైవర్ కాకుండా మరో ముగ్గురు మాత్రమే ప్రయాణం చేయాలనీ చెప్పారు. అలాగే ఇతర భారీ వాహనాల్లో వాటి సీట్ల సామర్ధ్యాన్నిబట్టి కేవలం 50 శాతం మంది ప్రయాణికులతో ప్రయాణించాలని ఆదేశాలు ఇచ్చారు. రాత్రి పూట కర్ఫ్యూ అమలవుతోన్న నేపథ్యంలో ఎవరైనా బయటకు వస్తే చర్యలు తప్పవని చెప్పారు. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం పూర్తిస్థాయి లాక్డౌన్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అన్నారు. ఇక ఇతర రాష్ట్రాలకు అత్యవసరంగా వెళ్ళవలసిన వారు, అందుకు తగిన సాక్ష్యాధారాలతో దరఖాస్తు చేసుకోవాలని ఏపీ పోలీస్ విభాగం సూచించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]