అగ్రి బిజినెస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆగ్రో ఇండస్ట్రీ అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మే 21, శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో నిపుణులతో సమావేశమయ్యారు. నిరంతరం మారుతున్న ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా ఉత్పత్తులు వచ్చేలా, వ్యవసాయాధారిత పరిశ్రమలకు నిరంతరం ముడి సరుకు అందించే విధంగా, వేసిన పంటంతా సంపూర్ణంగా అమ్ముడుపోయేలా, ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణలో పంటల సాగు జరగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. వ్యవసాయంలో పరిణితి సాధించడానికి ప్రభుత్వం స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అమలు చేస్తుందని సీఎం ప్రకటించారు.
“వ్యవసాయరంగంలో ఈ వర్షాకాలం పంటతో సంస్కరణల శకం ప్రారంభమౌతుంది. తెలంగాణ ప్రభుత్వం తమ శ్రేయస్సు కోసమే పనిచేస్తుందనే విశ్వాసం రైతుల్లో ఉంది. ఏ పంటైనా పండే నేలలున్నాయి. ఎన్నో సానుకూలతలున్న తెలంగాణలో అంతర్జాతీయ స్థాయిలో వ్యవసాయం, అగ్రి బిజినెస్, అగ్రి ఇండస్ట్రీ అభివృద్ధి జరగాలి. పండించిన పంటకు వాల్యూ అడిషన్ తో ఎక్కువ ధర వస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లు ఏర్పాటు చేస్తుంది. వీటికి కావాల్సిన ముడి సరుకును నిరంతరం అందించగలిగేలా సంఘటిత వ్యవసాయం కావాలి. నాణ్యమైన సరుకులు తయారు చేయడం వల్ల తెలంగాణ బ్రాండ్ కు అంతర్జాతీయ ఇమేజ్ ఏర్పడుతుందని” సీఎం కేసీఆర్ అన్నారు.
“జనాభాలో ఎక్కువ శాతం వ్యవసాయంలోనే ఉండడం ప్రగతికి సంకేతం కాదు. తెలంగాణలో వ్యవసాయాధారిత పారిశ్రామికీకరణకు ఎన్నో అనుకూలతలున్నాయి. రాష్ట్రంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు పెద్ద సంఖ్యలో వచ్చేట్లు కృషి జరగాలి. దీనివల్ల అటు పారిశ్రామిక రంగం, ఇటు సేవా రంగాలు కూడా విస్తరిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఏడాది పరిస్థితులు మారుతుంటాయి. దానికి అనుగుణంగా రైతులు పంటల మార్పిడి విధానం అవలంబించడం వల్ల ఎక్కువ దిగుబడి వస్తుంది. భూసారం పెరుగుతుంది. చీడపీడలు తక్కువుగా ఉంటాయి. రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల వ్యాపారుల మాట నమ్మి ఎరువులు, క్రిమి సంహారక మందులను వాడుతున్నారు. వీటిని అవసరానికి మించిన మోతాదులో వాడడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉండదనే విషయం కూడా రైతులకు వివరించాలని” సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వర్ రావు, సిఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్ రావు, అగ్రి బిజినెస్ కాలేజ్ ప్రిన్సిపాల్ డా. సీమా, ఏఎస్సీఐ డైరెక్టర్ శ్రీనివాసచారి, ఫుడ్ అండ్ అగ్రి మేనేజ్మెంట్ సలహాదారు గోపీనాథ్ కోనేటి, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ కేశవులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu