ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన మొత్తం మంత్రివర్గాన్ని రద్దు చేసిన తర్వాత, ఏప్రిల్ 11 న తాజా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి కసరత్తు ప్రారంభించారు. దీనిపై ఇప్పటికే ఆయన, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి మరియు సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డితో సహా తన సన్నిహితుల నుండి కొత్త మంత్రివర్గం కోసం ఆశావహుల జాబితాను తెప్పించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. సీఎం జగన్తో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు భేటీ అయ్యారు. సోమవారం కొత్త మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేయనున్న క్రమంలో, శనివారం ఆయన మంత్రుల తుది కూర్పుపై సీఎం జగన్తో కీలక సమావేశం జరిపారు.
సమావేశం ముగిసిన అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. నూతన కేబినెట్ కూర్పుపై కసరత్తు జరుగుతోందన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని, చివరి నిమిషం వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉండేలా సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కేబినెట్లో మహిళలకు సముచిత స్థానం ఉంటుందని సజ్జల తెలిపారు. గురువారం క్యాబినెట్ సమావేశం ముగిసిన వెంటనే 24 మంది మంత్రుల రాజీనామాలను ముఖ్యమంత్రి ఆమోదించారని, అదే విషయాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు తెలియజేసినట్లు తెలిపారు. సోమవారం ఉదయం 11.31 గంటలకు రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముందు ఆదివారం సాయంత్రం క్యాబినెట్ మంత్రుల తుది జాబితా రాజ్భవన్కు పంపబడుతుందని, అలాగే కొత్త మంత్రులకు కూడా దీనిపై ఆదివారం సాయంత్రమే సమాచారం అందజేస్తామని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ