సీనియర్ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మంచు మోహన్బాబు మంగళవారం తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు కుమారులు విష్ణు, మనోజ్లు కూడా కోర్టుకు వచ్చారు. 2019లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులో వారు స్థానిక కోర్టు ముందు హాజరయ్యారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో ఇంజినీరింగ్ కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ మోహన్బాబు తన కాలేజీ విద్యార్థులతో, ఇద్దరు కుమారులతో కలిసి 2019 మార్చి 22న తిరుపతి – మదనపల్లె జాతీయ రహదారిపై ఆందోళన చేశారు.
అయితే ఆ సమయంలో సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద మోహన్బాబు, ఆయన కుమారులు మంచు విష్ణు, మనోజ్ కుమార్, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల ఏవో తులసీ నాయుడు, పీఆర్వో సతీష్ తదితరులపై తిరుపతి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆందోళనలో భాగంగా వారు రోడ్డుపైకి వచ్చి వాహనదారులకు ఇబ్బంది కలిగించారని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని, ధర్నాకు ముందస్తు పోలీస్ అనుమతి లేదని, 341, 171(ఎఫ్), పోలీస్ యాక్ట్ 290 కింద చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో కేసు విషయమై కోర్టుకు హాజరయ్యే క్రమంలో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి కోర్టు ప్రాంగణం వరకు మోహన్బాబు, విష్ణు, మనోజ్ పాదయాత్రగా అభిమానులతో కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణం విద్యార్థులతో కిక్కిరిసింది. ఇక బిజెపి నేత కోలా ఆనంద్, వైసిపి నేతలు అన్నా రామచంద్ర, ఎంవియస్ మణిలు కోర్టు వద్దకు వచ్చి మోహన్ బాబుకు సంఘీబావం ప్రకటించారు. కాగా దీనిపై విచారణ జరిపిన నాల్గవ అదనపు కోర్టు తదుపరి విచారణను సెప్టెంబరు 20వ తేదికి వాయిదా వేసింది. అనంతరం కోర్ట్ బయట మోహన్బాబు మీడియాతో మాట్లాడుతూ.. కోర్టులో పిలిచారు, పేపర్ ఇచ్చారు, సంతకం పెట్టామన్నారు.. ఆ తర్వాత వాయిదా వేస్తున్నట్లు తెలిపారు అని అన్నారు. అయితే తనకు ఈ కేసు విషయంలో సమన్లు అందలేదని, జడ్జి పిలిచి సమన్లపై సంతకం పెట్టామన్నారు, పెట్టాను. ఇంతకుమించి ఇప్పుడు నేనేమీ మాట్లాడలేను అని చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ