కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ కారణంతో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేయడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆదివారం నాడు సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ అయ్యి రాష్ట్రంలో ఏకపక్ష నిర్ణయంతో ఎన్నికలు వాయిదా వేశారని ఫిర్యాదు చేశారు. దీంతో మార్చ్ 16, సోమవారం నాడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్కుమార్ రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలుసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడానికి దారితీసిన పరిస్థితులు, కారణాలను ఈ సందర్భంగా గవర్నర్ కు వెల్లడించినట్టుగా తెలుస్తుంది. సీఎం ఫిర్యాదు నేపథ్యంలోనే గవర్నర్ ఎస్ఈసీ వివరణ కోరినట్టుగా సమాచారం.
మరో వైపు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. నోటిఫికేషన్ లో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికల పక్రియను నిర్వహించేందుకు కార్యాచరణ చేపట్టాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం లేదని, ప్రభుత్వం అన్ని రకాల నివారణ చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో పరిస్థితి అదుపులోనే ఉందని ఆమె లేఖలో వివరించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అడ్డంకి లేకుండా కరోనా నియంత్రణ చర్యలు చేపట్టవచ్చని ఆమె పేర్కొన్నారు. అలాగే పోలింగ్ రోజున కూడా జనాలు గుంపులుగా ఉండకుండా నియంత్రించవచ్చని సీఎస్ నీలం సాహ్ని లేఖలో తెలిపారు.
[subscribe]