ఆంధ్రప్రదేశ్ లోని ఉపాధ్యాయులు ఎట్టకేలకు తమ పంతం వీడారు. రాష్ట్రప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నెజేషన్ యాప్ను వ్యతిరేకించిన ఉద్యోగులు తాజాగా తమ నిర్ణయం మార్చుకున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో పలు దఫాలుగా చర్చలు జరిపిన ఉపాధ్యాయ సంఘాలు గురువారం రాత్రి మరోసారి చర్చల్లో తమ అనుమానాలను మంత్రి బృందం ముందు ఉంచగా వారు ఉద్యోగులకు యాప్ పనితీరుని గురించి సవివరంగా వివరించారు. దీంతో ఉపాధ్యాయులు ఈ ఫేషియల్ యాప్ విధానానికి ఒప్పుకున్నారు. ఈ మేరకు చర్చలు ముగిసిన అనంతరం మంత్రి బొత్స దీనిపై అధికారిక ప్రకటన చేశారు. దీంతో శుక్రవారం నుంచి ఏపీలో ఉపాధ్యాయులు ఈ ఫేస్ రికగ్నెజేషన్ యాప్ ద్వారా అటెండెన్స్ వేయనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయని, ఫేస్ రికగ్నెజేషన్ యాప్కు టీచర్లు అంగీకారం తెలిపారని ప్రకటించారు. విద్యావ్యవస్థలో మార్పులు రావాలనే ఈ నిర్ణయం తీసుకున్నామన్న మంత్రి, త్వరలోనే ఇతర ప్రభుత్వ శాఖల్లో కూడా దీనిని ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఇక ఈ యాప్లోని లోపాలను సరిదిద్దామని, ప్రతి ఒక్క టీచర్ తప్పనిసరిగా ఈ యాప్ను తమ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. హాజరు నమోదులో ఎదురవుతున్న ఇబ్బందులను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఇక విద్యావ్యవస్థలో మరిన్ని మార్పులు తేవడానికి ప్రయత్నిస్తున్నామని, దీనిలో భాగంగా మండలానికి ఇద్దరు ఎంఈవోలను నియమిస్తున్నామని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ