ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు-2022 ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షల ఫలితాలను రేపు (జూన్ 4, శనివారం) విడుదల చేయనున్నట్టు ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. ఏపీ విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్ శనివారం ఉదయం 11గంటలకు విజయవాడలో ఫలితాలను విడుదల చేయనున్నట్టు తెలిపారు. కాగా ఈసారి గ్రేడ్స్ రూపంలో కాకుండా మార్కుల రూపంలో ఫలితాలను ప్రకటించాలని విద్యాశాఖ నిర్ణయించింది. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లు పదో తరగతి పరీక్షలు నిర్వహించలేదు. 2019 తరువాత ఈ ఏడాదే పరీక్షలు నిర్వహించారు. పదో తరగతిలో ఏడు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించడంతో పాటుగా, తొలిసారిగా సమాధానాలు రాసేందుకు విద్యార్థులకు 24 పేజీల బుక్లెట్ ను అందించారు. ఈ నేపథ్యంలో రికార్డు స్థాయిలో పరీక్షలు నిర్వహించిన 25 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది.
మరోవైపు పదో తరగతి పరీక్షల ఫలితాల అనంతరం ఇచ్చే ప్రకటనలు/యాడ్స్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి ఫలితాలకు సంబంధించి విద్యాసంస్థలు ర్యాంకులను ప్రకటించడాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్ధుల ర్యాంకులపై ఎలాంటి ప్రచారం చేయకూడదని విద్యాసంస్ధలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాల్ని ఉల్లంఘించి ర్యాంకులు ప్రకటిస్తే విద్యాసంస్థలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. పదో తరగతి ర్యాంకులను ప్రకటించినా లేదా టీవీల్లో ప్రకటనల రూపంలో ప్రచారం చేసినా అందుకు బాధ్యులైన వారికి కనీసం 3 సంవత్సరాలు లేదా గరిష్టంగా 7 సంవత్సరాలు శిక్ష విధింపు, లక్ష రూపాయల వరకూ జరిమానా కూడా విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF