తిరుపతిలో సొంత ఇళ్ల స్థలాల కోసం 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న టీటీడీ ఉద్యోగుల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి గురువారం శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణన్కు భూమి ధర రూ.61.63 కోట్ల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ.. మూడు దశాబ్దాలుగా టీటీడీ ఉద్యోగులు ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారని, త్వరలోనే వారి ఆకాంక్ష ఫలిస్తోందని తెలిపారు. మరో మూడు నెలల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామన్నారు.
దీనికోసం తిరుపతి సమీపంలోని వడమాలపేట మండలం పాదిర్వేడు గ్రామంలో సేకరించిన 300.22 ఎకరాల భూమికి సంబంధించి చెల్లించాల్సిన రూ.61.63 కోట్ల మొత్తాన్ని కలెక్టర్ హరినారాయణన్కు అందజేశారు. దీంతో టీటీడీ సంస్థలోని 5,518 మంది ఉద్యోగులకు ఇళ్ల స్థలాలిచ్చేందుకు మార్గం సుగమం అయ్యిందన్నారు. ఇంతకుముందు ఉద్యోగుల ఇళ్ల స్థలాల విషయమై వైఎస్సార్ హయాంలో తీర్మానం చేశారని, అయితే కొందరు కోర్టుకు వెళ్లడంతో ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరిందని గుర్తుచేశారు. అలాగే భవిష్యత్లో ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా హౌస్ బిల్డింగ్ సొసైటీని ఏర్పాటు చేసుకోవాలని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉద్యోగులకు సూచించారు. శ్రీపద్మావతి వసతి గృహంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డితో పాటు జిల్లాకు చెందిన పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ