ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో, రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినదంటూ పలువురు పేర్లతో ఉన్న భూమి వివరాలను ప్రకటించారు. రాజధాని ప్రాంతంలో సుజనా చౌదరికి, చంద్రబాబు బంధువులకు భూములున్నాయని, అక్కడ జరిగిన భూ అక్రమాల్ని వరుసగా వివరిస్తాం అని చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు వియ్యంకుడికి వియ్యంకుడు అయిన రామారావుకు చెందిన వీబీసీ సంస్థకు ఏపీఐఐసీ ద్వారా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో ఎకరా రూ. లక్ష చొప్పున 493 ఎకరాలిచ్చారని, దీనిని ఇన్సైడర్ ట్రేడింగ్ అనాలా, క్విడ్ ప్రో కో అనాలా అని ప్రశ్నించారు.
బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను బాలకృష్ణ చిన్నల్లుడు ఎ.భరత్ ఖండించారు. తమ సంస్థకు స్థలం ధారాదత్తం చేసారంటూ బొత్స అసత్య వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉన్నప్పుడే తమ సంస్థకు భూములు కేటాయించారని, అప్పట్లో కేటాయించిన భూములు అమరావతి నుంచి 100 కి.మీ దూరంలో ఉన్నాయని పేర్కొన్నారు. న్యాయపరమైన వివాదం కారణంగా ఆభూముల్ని ఇంతవరకు ఇవ్వలేదని, తన పెళ్ళికి ఆరేళ్ళ క్రితమే ఈ ప్రాజెక్టు వ్యవహారం జరిగిందని భరత్ చెప్పారు. ఈ వ్యవహారంలో టీడీపీ పాత్ర ఏమిలేదని, చంద్రబాబుపై బురదజల్లే ఉద్దేశంతోనే బొత్స ఈ ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.
[subscribe]
[youtube_video videoid=lD3SAzZPCYo]