బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు బుధవారం నాడు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మార్పు అంశంపై మాట్లాడారు. రాజధాని పై రాష్ట్ర మంత్రులు చేసే వ్యాఖ్యలు ప్రజలలో గందరగోళానికి కారణమవుతున్నాయని చెప్పారు. తనకున్న సమాచారం ప్రకారం అమరావతిలో రాజధానిని కొనసాగించే యోచన అధికార వైసీపీ ప్రభుత్వానికి లేదనిపిస్తుందని చెప్పారు. అమరావతిలో రాజధానిని కొనసాగించకపోతే భూములిచ్చిన రైతుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. భూములిచ్చి సహాయం చేసిన రైతులను ఎలా ఆదుకుంటారో ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పారు.
రాజధాని నిర్మాణం అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, గతంలో కూడ కేంద్రప్రభుత్వ సూచన మేరకే అక్కడ నిర్మాణాలు చేపట్టలేదని చెప్పారు. అమరావతిలో భూసేకరణ అవసరానికి మించి చేసారని చెప్పారు. గత ప్రభుత్వం అనుకున్న రీతిలో అమరావతిని అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రాజధానిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని కోరారు. మంత్రులు చేసే పరస్పర విరుద్ధ ప్రకటనల వలన రోజు రోజుకి గందరగోళం పెరుగుతుందని చెప్పారు. ప్రజాప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా ప్రభుత్వ విధానాలు ఉండకూడదని పేర్కొన్నారు.
[subscribe]
[youtube_video videoid=p4HtyCHClzY]