ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చ్ 8, ఆదివారం నాడు విజయవాడలో ఇరు పార్టీల ముఖ్యనేతలు, సమన్వయకమిటీల సభ్యులతో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సుమారు రెండు గంటలపాటు పాటు జరిగిన ఈ సమావేశంలో స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలపై చర్చించారు. సమావేశమనంతరం బీజేపీ నేత పురందేశ్వరి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికలకోసం మార్చ్ 12న ఇరు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు వారు స్పష్టం చేశారు. అలాగే అభ్యర్థుల ఎంపిక కూడా సత్వరమే పూర్తి చేస్తామని తెలిపారు.
నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ ఇరుపార్టీల పొత్తుతోనే పోటీ చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఈ పొత్తును మరింత దృఢంగా, విజయవంతంగా ముందుకు తీసుకెళ్తామని అన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని ఓట్లు వేయాలని నాదెండ్ల మనోహర్ కోరారు. బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ, ప్రతిపక్షాలను దెబ్బతీసే ఉద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వం ఇంత తక్కువ సమయంలో ఎన్నికలు పక్రియను నిర్వహించాలని చూస్తుందన్నారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమన్వయ కమిటీలు వేసుకుంటూ స్థానిక ఎన్నికల్లో ముందుకెళ్లేందుకు ఇరుపార్టీలు నిర్ణయించుకున్నాయని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని పురందేశ్వరి చెప్పారు.
[subscribe]