హైదరాబాద్లో వాసవీభవన్లో నిన్న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన మారుతీరావు అంత్యక్రియలు మార్చ్ 9, సోమవారం నాడు మిర్యాలగూడలో పూర్తయ్యాయి. ఆయన కుటుంబసభ్యులు అంత్యక్రియలను నిర్వహించారు. అయితే పోలీసు భద్రత సహాయంతో తన తండ్రి మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన కుమార్తె అమృతకు నిరాశ ఎదురైంది. తన తండ్రిని కడసారి చూసేందుకు శ్మశానవాటికకు చేరుకోగా, ఆమె రాకను కుటుంబసభ్యులు వ్యతిరేకించి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆమె అక్కడి నుంచి వెనుదిరిగారు. మారుతీరావు అంతిమయాత్రలో స్థానిక ఎమ్మెల్యే భాస్కర్రావు, మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో మారుతీరావు ప్రధాన నిందితుడు. ముందుగా మారుతీరావు కుమార్తె అమృత, మరియు అదే పట్టణానికి చెందిన పెరుమాళ్ల ప్రణయ్ హైదరాబాద్లోని ఆర్యసమాజ్లో ప్రేమ వివాహం చేసుకున్నారు. మారుతిరావుకు ఈ ప్రేమ వివాహం ఇష్టం లేకపోవడంతో రెండు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. పోలీసులుతో సంప్రదింపుల అనంతరం అమృత తన భర్త దగ్గరే ఉండడానికి నిశ్చయించుకుంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల తర్వాత ఓ ఆసుపత్రి వద్ద ప్రణయ్ పై దుండగులు కత్తితో దాడి చేయడంతో అక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ హత్యలో అమృత తండ్రి మారుతీరావు ప్రమేయముందని భావించిన పోలీసులు అతడిని ఏ1గా, అమృత బాబాయి శ్రవణ్ ను ఏ2గా పేర్కొంటూ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దీంతో కొంతకాలం జైలులో గడిపి బెయిల్ పై బయటకు వచ్చిన మారుతీరావు మనోవేధనతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తుంది.
[subscribe]