ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ, పార్టీల మధ్య ఇప్పుడే ఎలక్షన్ హీట్ కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి ప్రధాన పార్టీల మధ్య యుద్ధం నడుస్తోంది. ఏఏ పార్టీల మధ్య అవగాహన ఉంది? ఎవరితో ఎవరు కలిసి నడుస్తున్నారు? వంటి విషయాలపై ఆరోపణలు చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా.. ఏపీలోని ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ- బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్న ఏపీ బీజేపీ ఇన్చార్జ్ సునీల్ దియోధర్ వ్యాఖ్యలు కొత్త చర్చకు తెరతీశాయి. ఆయన కామెంట్స్పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి, వైసీపీకి సంబంధం లేదని నేతలు చెప్పడం కాదని, అది ప్రజలు అనుకోవాలంటూ సెటైర్లు వేశారు.
అలాగే మరోవైపు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ టీడీపీతో కలవడానికి ముందుకు వస్తుంటే బీజేపీ అడ్డుకుంటోందని, ఆయనను భయపెడుతోందని ఆరోపించారు. జనసేన, టీడీపీతోనే ఉందన్న పితాని కామెంట్స్ రాష్ట్రంలో హాట్టాపిక్గా మారాయి. ఈ నేపథ్యంలో.. పితాని సత్యనారాయణ వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు కౌంటర్ ఇచ్చారు. ఏపీలో తమది ప్రతిపక్ష పాత్ర అని, వైసీపీతో ఎలాంటి సంబంధాల్లేవని, బీజేపీ-జనసేన కూటమి అధికారంలోకి రావాలన్నదే తమ టార్గెట్ అని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ తొలినుంచి బీజేపీ సానుకూల వైఖరితోనే ఉన్నారని, టీడీపీ నేతలే ఆయన పార్టీ జనసేనతో పొత్తు కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. ఇక మొత్తానికి ఏపీ రాజకీయాల్లో పొత్తులపై ఆసక్తికర చర్చ జరుగుతుండగా.. బీజేపీ-టీడీపీ మధ్య మాటల యుద్ధం పొలిటికల్ హీట్ పెంచుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE