టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల మధ్య ఆర్థిక సమానత్వాన్ని సాధించే దిశగా సరికొత్త ‘ఐడియాలజీ కాన్సెప్ట్’ అనే విధానానికి రూపకల్పన చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ ఆర్థిక ప్రగతి ఫలాలు అందించేలా ప్రత్యేక విధానానికి శ్రీకారం చుట్టారు. ఓ ప్రాంతానికి, ఓ వర్గానికి అనుకూలంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శల నేపథ్యంలో ఆయన మార్కాపురం పర్యటనలో దీనికి సంబంధించిన ఆలోచనను ఆవిష్కరించారు. తద్వారా ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు కొత్త వ్యూహాలతో ఇప్పటినుంచే రెడీ అవుతున్నారు. పేదలను సంపన్నుల స్థాయికి అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ నూతన కాన్సెప్ట్ ఉండటం విశేషం.
ఈ మేరకు గురువారం మార్కాపురం సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఆర్థిక ప్రగతితో కేవలం కొంతమంది వ్యక్తులు (లేదా) కొన్ని వర్గాలే అభివృద్ధి చెందడం కాకుండా, అన్ని కుటుంబాలకు దీని ప్రయోజనాలు అందేలా చూడడం ఈ విధానం లక్ష్యమని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే దీనిని పక్కాగా అమలు చేయాలని భావిస్తున్నామని, జన్మభూమి కార్యక్రమం మాదిరిగానే దీనికి కూడా ఒక పేరు పెట్టి అమలు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. దీని ప్రకారం.. ఒక కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని దానిని ఎలా ఆర్థికంగా పైకి తేవాలన్న దానిపై కసరత్తు చేస్తున్నామని, ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ప్రతి కుటుంబ యొక్క వాస్తవ స్థితిగతులు, ఆ కుటుంబంలోని మానవ వనరులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఒక ప్రణాళికతో వెళ్తే సుమారు 10-15 ఏళ్ల వ్యవధిలోనే మొత్తం కుటుంబాలను పేదరికంలో నుంచి బయటకు తేవచ్చని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకుని ప్రతి కుటుంబం పరిస్థితిని పర్యవేక్షించడం, వారితో నిత్యం సంబంధాలు నిర్వహించడం ద్వారా ఒక అంచనాకు రావొచ్చని, దీనికోసం ప్రభుత్వ పరంగా అనుసంధానం ఏర్పరచుకోవడానికి ప్రత్యేక సాఫ్ట్వేర్ను కూడా తయారు చేయించే పనిలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలు కోసం ప్రత్యేకంగా ఒక శాఖను కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఇక సాంఘిక సాంస్కృతిక వెనుకబాటు అనేది కూడా సమాజంలో కొన్ని కులాలు, వర్గాల వెనుకబాటుకు కారణమవుతోందని, ప్రవాసాంధ్రులు, సంపన్న తెలుగు వర్గాల వారికి భాగస్వామ్యం కల్పించి కొన్ని కుటుంబాలను ఆర్థికంగా పైకి తేవడానికి కృషి చేయాల్సి ఉందని చంద్రబాబు నాయుడు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE