నాంపల్లిలోని సీబీఐ, ఈడీ కోర్టులో జనవరి 17, శుక్రవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా విచారణకు సీఎం వైఎస్ జగన్ హాజరు కావడం లేదని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. శుక్రవారం నాటి విచారణకు ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అలాగే ప్రభుత్వ సంబంధిత అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నందువలన హాజరు కాలేకపోతున్నట్లు పేర్కొంటూ డిస్పెన్స్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సీఎం వైఎస్ జగన్కు సీబీఐ కోర్టు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది.
మరోవైపు పెన్నా అనుబంధ ఛార్జిషీటుకు సంబంధించి ఈ రోజు సీబీఐ కోర్టులో విచారణకు ప్రక్రియ మొదలైంది. ఈ కేసులో గత శుక్రవారం నాడు ఏడుగురు నిందితులకు కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు విచారణ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీ ధర్మాన ప్రసాదరావు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కోర్టుకు హాజరయ్యారు. అలాగే ఈ కేసులో తదుపరి విచారణను జనవరి 24వ తేదికి కోర్టు వాయిదా వేసింది.
[subscribe]