2012లో నిర్భయ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు జనవరి 7న నలుగురు దోషులకు డెత్ వారెంట్ జారీ చేసి, జనవరి 22 ఉదయం 7 గంటలకు వారిని ఉరితీయాలని ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో నలుగురు నిందితులలో ఒకరైన ముఖేశ్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోవడంతో ఉరిశిక్ష అమలుపై సందిగ్ధత నెలకొంది. ముందుగా క్షమాభిక్ష కోసం ముఖేశ్ చేసిన అభ్యర్థనను తిరస్కరించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ క్షమాభిక్ష పిటిషన్ను కేంద్ర హోంశాఖకు పంపించారు.
అనంతరం ఈ క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించాలని హోంశాఖ రాష్ట్రపతికి సిఫార్సు చేస్తూ జనవరి 7, గురువారం రాత్రి రాష్ట్రపతి భవన్కు పంపించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ముఖేశ్ కుమార్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరిస్తూ శుక్రవారం నాడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించడంతో కోర్టు ఆదేశాల ప్రకారం జనవరి 22న నలుగురు దోషులకు ఉరి తీస్తారా లేదా అనే విషయంపై మరికొద్ది గంటల్లో స్పష్టత రానుంది.
[subscribe]