ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వర్షాలు, వరదలతో భారీ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్షాలు, వరదల వలన ప్రభావితమైన ప్రాంతాలను పరిశీలించి, ఏర్పడ్డ నష్టాన్ని అంచనా వేసేందుకు రెండ్రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర బృందం ఈ రోజు ఏపీ కి చేరుకుంది. ముందుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో కేంద్ర బృందం సమావేశమయ్యింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరిగిన నష్టంపై పలు శాఖల అధికారులు కేంద్ర బృందానికి ప్రజెంటేషన్ ఇచ్చారు. వర్షాలు, వరదల వల్ల రూ.6,368 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు కేంద్ర బృందానికి నివేదిక అందజేశారు.
సీఎస్ నీలం సాహ్ని మాట్లాడుతూ, జరిగిన నష్టానికై తాత్కాలిక పునరుద్ధరణ చర్యల నిమిత్తమే తక్షణం 840 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అన్నారు. శాశ్వత పునరుద్ధరణ చర్యలకు రూ.4,439 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పారు. మరోవైపు విజయవాడ నగరంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ని కూడా కేంద్ర బృందం సందర్శించింది. సీఎస్ నీలం సాహ్నీతో భేటీ అనంతరం కేంద్ర బృందాలు క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అనంత పురం, కృష్ణ, ప్రకాశం జిల్లాలతో పాటుగా పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేయనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ