కొన్నాళ్లుగా సంక్షోభంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్.. వైఎస్సార్సీపీ అభ్యర్థులను కలవరపరుస్తోంది. ఇంతకాలం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గండం వైసీపీ నేతలను వెంటాడగా.. తాజాగా గంగవరం పోర్టు సమ్మె వల్ల ఏర్పడిన ముడిసరకు కొరత ..ఇప్పుడు ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థులకు శాపంలా మారుతోంది.
దీనికి తోడు విశాఖ స్టీల్ ప్లాంట్ను రక్షించాలంటూ సీఎం వైఎస్ జగన్ను మూడు రోజుల క్రితం కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నేతలకు హామీ దొరకలేదు సరికదా.. వైఎస్సార్సీపీని గెలిపిస్తే తరువాత చూద్దాం అంటూ జగన్ దాటవేయడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఎన్నికల సమయంలో హామీ ఇవ్వాల్సిన సీఎం..అసలు అది పెద్ద సమస్య కాదన్నట్టు తేలిగ్గా తీసి పారేయడమే ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్థులను భయపెడుతోంది. అయితే మరోవైపు టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎం. శ్రీభరత్ విశాఖ పార్లమెంటు మేనిఫెస్టోలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపడమే తమ కీలక అంశమని పేర్కొనడం..ఉక్కు కార్మికులను శాంతినిచ్చింది.
ప్లాంట్కు అవసరమైన ముడిసరకు పర్మిషన్లు, ఇసుక లైసెన్సులు కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లగా అది పెద్ద విషయమే కాదన్నారు. నిజానికి విజయనగరంలో ఇసుక క్యారీ లైసెన్స్ను..జగన్ సర్కార్ మూడేళ్ల నుంచి పునరుద్దరించకపోవడం వల్ల ప్లాంట్పై రూ. 80 కోట్ల వరకూ భారం పడిన అంశాన్ని జగన్ అంత లైట్గా తీసుకోవడం వీరికి అంతచిక్కని విషయంగా మారిపోయింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి బాగాలేక శాలరీలకు కూడా ఇబ్బందులు ఎదురౌతున్నాయని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా.. ప్లాంట్ లాభాల్లోనే ఉంది కదా అని జగన్ ప్రశ్నించడం వీరికి షాక్ తగిలేలా చేసింది. అలాగే స్టీల్ ప్లాంట్ లో ఉన్న ఇతర సమస్యలు చెప్పే ప్రయత్నం చేయగా, గాజువాక ఎమ్మెల్యేగా గుడివాడ అమర్నాథ్ను, విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీని గెలిపించమని జగన్ చెప్పడంతో నోట మాట రాక నిలబడాల్సిన పరిస్థితి ఎదురయింది.
అయితే సీఎం జగన్ను కలిసిన వాళ్లలో అన్ని రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉండే కార్మిక సంఘాల నాయకులు ఉండడంతో.. జగన్ తీరుపై ఏపీ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయింది. కేంద్రం సంగతి ఇప్పటికే క్లారిటీ రావడంతో.. ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తిరిగి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడ ఉండదనే అభిప్రాయాన్ని ఉద్యోగులు, కార్మికులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ప్రభావం బొత్స ఝాన్సీ,గుడివాడ అమర్నాథ్లపై ప్రత్యక్షంగా పడునుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఆంధ్రుల హక్కుగా ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్లో 18 వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 30 వేల మంది పనిచేస్తున్నారు. బీజేపీ అనకాపల్లి అభ్యర్థి అయిన సీఎం రమేష్, టీడీపీ విశాఖ అభ్యర్థి ఎం. శ్రీభరత్.. తాము ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకొంటామని విశాఖ వాసులకు హామీ ఇచ్చి ప్రచారం చేస్తున్నారు. దీనికి విరుద్ధంగా సీఎం జగన్ తీరు ఉండటంతో.. విశాఖ స్టీల్ ప్లాంట్కు వైఎస్సార్సీపీ ప్రభుత్వమే శాపంగా మారుతుందనే అభిప్రాయం కలిగితే.. ఈ ప్రభావం తమ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తుందని వైసీపీ అభ్యర్థులు కలవరపడుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY