ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వం లోని బృందం రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా దావోస్ పర్యటనలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఒక కీలక ఒప్పందాన్ని చేసుకుంది. కాలుష్యంలేని ఇంధనం ఉత్పత్తే లక్ష్యంగా రెండు మెగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకోసం రూ. 60 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి అదానీ గ్రీన్ ఎనర్జీతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ మేరకు దావోస్లో సోమవారం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశం సందర్భంగా సీఎం జగన్ అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో సమావేశమయ్యారు. సీఎం కోరిక మేరకు అదానీ గ్రీన్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్లో 10,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ మరియు మరో 3,700 మెగావాట్ల హైడ్రో స్టోరేజీ ప్లాంట్ను ఏర్పాటుకు ముందుకొచ్చింది.
సీఎం జగన్, గౌతమ్ అదానీల సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పెషల్ చీఫ్ సెక్రటరీ (పరిశ్రమలు మరియు వాణిజ్యం) కరికాల వలవన్, అదానీ గ్రీన్ ఎనర్జీ తరఫున ఆశిష్ రాజ్వంశీ ఎంఓయూపై సంతకాలు చేశారు. దీని ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా దాదాపు 10,000 మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నాయని అధికారులు తెలిపారు. వరుసగా రెండవ రోజు సీఎం జగన్ మరియు అదానీ మధ్య చర్చల అనంతరం అదానీ గ్రూప్తో ఏపీ కీలక భాగస్వామ్యం కుదిరింది. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఈరెండు ప్రాజెక్టులు అత్యంత కీలకం కానున్నాయి. భవిష్యత్తులో సుస్థిర వృద్ధికి దోహదపడే ఆర్థిక వ్యవస్థను డీకార్బనైజ్ చేసే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని ఏపీ సీఎంవో ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ