ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటల గణనను త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన సోమవారం వ్యవసాయ శాఖపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతులెవరూ నష్టపోకుండా ఈ రబీ సీజన్లో పండిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాలనీ, వర్షాల కారణంగా తడిసిపోయిన ధాన్యాన్ని సైతం సేకరించాలని అధికారులను ఆదేశించారు.
ఇంకా సీఎం జగన్ మాట్లాడుతూ.. అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతుల జాబితాను త్వరగా సిద్ధం చేయాలని, తడిసిన ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన వ్యవసాయ క్షేత్రాల నుండి మిల్లులకు తరలించడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే చెల్లింపుల కోసం రైతులు మిల్లర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలని, ఆర్బీకేల ద్వారా రైతులకు సరిపడా గన్నీ బ్యాగులను సరఫరా చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ సచివాలయాల నుండి ఆయా ప్రాంతాల్లోని రైతులకు జరిగిన నష్టంపై నివేదికలను తెప్పించుకోవాలని, ఈ క్రమంలో బాధిత రైతుల పేరు లిస్టులో ఉందో.. లేదో తెలుసుకోవడానికి గ్రామ సచివాలయాల వద్ద జాబితాలను ప్రదర్శించాలని, ఒకవేళ అలాంటి సమస్యలను గుర్తిస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్లి తిరిగి జాబితాలో వారి పేర్లను చేర్చాలని సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE