ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పల్నాడు జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన వినుకొండలో స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఆర్థిక సహాయం అందించే ప్రత్యక్ష లబ్ధి బదిలీ పథకం ‘జగనన్న చేదోడు’ మూడో విడత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,30,145 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 330.15 కోట్ల ఆర్థిక సహాయం జమ చేశారు. కాగా సాంప్రదాయ కుల ఆధారిత వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వెనుకబడిన తరగతులలోని నాయీ బ్రాహ్మణులు, రజకులు మరియు టైలర్లకు ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.10,000 సహాయం అందిస్తోంది. ఇక మూడవ విడత విడుదలతో, ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం సహాయం ఒక్కో లబ్ధిదారునికి రూ. 30,000 అవుతుంది. అలాగే 2020-21 సంవత్సరంలో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 2,98,122 కాగా.. పంపిణీ చేయబడిన మొత్తం రూ. 298.12 కోట్లు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈరోజు 3,30,145 మంది లబ్ధిదారులకు 330.15 కోట్ల ఆర్థిక సాయం విడుడల చేయడం సంతాషాన్నిస్తోందని, వారి ఇళ్లలో సంక్రాతి వెలుగులు నింపడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. జీడీపీ వృద్ధి రేటులో దేశంలోనే తొలిస్థానంలో ఏపీ నిలిచిందని, కానీ ప్రతిపక్షాలు మాత్రం వైసీపీ పాలనలో ఏపీ పరిస్థితి శ్రీలంకలా తయారవుతోందని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని విమర్శలు చేసినా వైసీపీ ప్రభుత్వం మాత్రం ప్రజల సంక్షేమానికే కట్టుబడి ఉందని, అందుకే గత ప్రభుత్వాలు దృష్టి పెట్టని వర్గాల కోసం.. ‘జగనన్న చేదోడు’, ‘వాహన మిత్ర’ ‘వైఎస్సార్ కాపు నేస్తం’, ‘వైఎస్సార్ రైతు భరోసా’ వంటి వినూత్న పథకాలు ప్రారంభించామని జగన్ తెలిపారు. ఈ పథకాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమందికి నేరుగా బటన్ నొక్కి నగదును వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని వెల్లడించారు. ఈ పథకాలను అత్యంత పారదర్శకంగా అమలు చెస్తున్నామని, ఎక్కడా లంచాలు కానీ, వివక్ష కానీ లేవని స్పష్టం చేశారు. ఇక వైసీపీ ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఇలాగే ఉంటే వారికోసం ముందుముందు మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE