తెలంగాణలోని హుజూరాబాద్, ఏపీలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. అక్కడక్కడా స్వల్ప ఘటనలు మినహా రెండు చోట్ల కూడా పోలింగ్ పక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 7 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య కరోనా బాధితులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా హుజూరాబాద్ లో సాయంత్రం 5 గంటల వరకు 76.26 % పోలింగ్ నమోదు పోలింగ్ శాతం నమోదుకాగా, బద్వేలులో సాయంత్రం 5 గంటల వరకు 59.58 % పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అయితే పూర్తిస్థాయి పోలింగ్ శాతం ఇంకా తెలియాల్సి ఉంది.
హుజూరాబాద్ పోరులో 30 మంది బరిలో నిలిచినప్పటికీ, ముఖ్యంగా ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ల మధ్యే త్రిముఖ పోరు నెలకుంది. బీజేపీ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ తరపున బల్మూరి వెంకట్ నర్సింగ్ రావు ఈ ఉపఎన్నికల్లో బరిలో నిలిచి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మూడు పార్టీల కీలక నేతలు కూడా పెద్దఎత్తున ప్రచారం నిర్వహించడంతో ఈ ఉపఎన్నికలో ఎవరు విజయం సాధిస్తారనే ఆసక్తి రాష్ట్ర ప్రజల్లో నెలకుంది. ఇక నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితం వెల్లడించనున్నారు.
అలాగే బద్వేలు పోరులో 15 మంది బరిలో నిలిచినప్పటికీ, ముఖ్యంగా ప్రధాన పార్టీలైన వైఎస్సార్సీపీ, బీజేపీ, కాంగ్రెస్ ల మధ్యే పోరు నెలకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధ బరిలో నిలవగా, బీజేపీ అభ్యర్థిగా పనతల సురేష్, కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పోటీ చేస్తున్నారు. ఈ ఉపఎన్నికలో మూడు పార్టీల కీలక నేతలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏపీలో తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక తర్వాత మళ్ళీ ఎన్నికలు జరుగుతుండడంతో ప్రజల్లో ఆసక్తి నెలకుంది. ఇక్కడ కూడా నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాన్ని వెల్లడించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ