ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు, అక్టోబర్ 2 నుంచి ప్రారంభమయ్యే గ్రామ,వార్డు సచివాలయాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయాల ప్రారంభ సన్నాహకాలపై రాష్ట్ర మంత్రులు, అధికారులతో చర్చించారు. నాలుగు నెలల వ్యవధిలోనే నాలుగు లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టగలిగామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సచివాలయ పరీక్షలను విజయవంతంగా నిర్వర్తించిన అధికారులను సీఎం జగన్ అభినందించారు. ప్రజాసమస్యలపై ఫిర్యాదులు, సమస్యలను తెలియజేయడానికి ఒక ప్రత్యేక నంబర్ ఉండాలని సీఎం జగన్ సూచించగా, అందుకోసం 1902 కాల్ సెంటర్ ను సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలియజేసారు. సచివాలయ పరీక్షల ఫలితాలను సెప్టెంబర్ చివరి వారంలో వెల్లడిస్తామని తెలిపారు.
గ్రామ సచివాలయాల్లో మౌలిక వసతుల ఏర్పాట్లపై సీఎం జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 72 గంటల్లో సమస్యను తీర్చడానికి అవసరమైన విధముగా ఏర్పాట్లు ఉండాలని, సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించడానికి సచివాలయాల్లో ఒక డేటా సెంటర్ ఉండాలని చెప్పారు. గ్రామ సచివాలయానికి, రాష్ట్ర సచివాలయానికి అనుసంధానం కలిగి ఉండాలని అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామాలు, పట్టణాల్లో ఇళ్ల స్థలాలపై గ్రామ వాలంటీర్ల సర్వే పూర్తయ్యింది అని అధికారులు సీఎం జగన్ కు వివరించారు.
రైతు భరోసా లబ్ధిదారుల ఎంపికను కూడ వేగవంతం చేయాలని అన్నారు. ప్రభుత్వ పధకాలు లబ్ధిదారుల ఎంపికపై గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీలు జరిపి, లబ్ధిదారుల జాబితాను సచివాలయంలో ఉంచాలని చెప్పారు. సచివాలయాల ద్వారా 237 రకాల సేవలు అందించాలని, 72 గంటల్లో అందే 115 రకాల సేవలతో పాటు మిగిలిన వాటికీ కూడ ఎప్పటిలోగా పూర్తి అవుతాయో వర్గీకరణ చేయాలని అన్నారు. కొత్తగా పింఛన్లు కోసం దరఖాస్తు చేసుకున్న వారికీ డిసెంబర్ నెల నుంచి అందజేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.
[subscribe]
[youtube_video videoid=4cTh_Og2ZAk]