ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన జిల్లాలోని సున్నపురాళ్లపల్లె గ్రామంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు. ఈ భూమిపూజ కార్యక్రమంలో సీఎం జగన్తో పాటు జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ కూడా పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని వైఎస్సార్ కలలు కన్నారని, ఈరోజు అది నెరవేరుతుందని సంతోషం వ్యక్తం చేశారు. రెండు దశల్లో రూ.8,800 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ నెలకొల్పేందుకు జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీ ముందుకు వచ్చిందని, మరో నెల రోజుల్లో ఈ ప్రాజెక్టు తొలిదశ పూర్తవుతుందని తెలిపారు. ఈ క్రమంలో తొలివిడతలో రూ.3,300 కోట్లతో ఏటా 10 టన్నుల స్టీల్ ఉత్పత్తి చేయనున్నారని చెప్పారు. ఈ ప్లాంట్ అవసరాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, ప్రధాన వనరైన నీటి సరఫరాకు గండికోట రిజర్వాయర్ నుంచి ప్రత్యేకంగా పైపులైన్ ద్వారా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఇక ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసుకుని పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం స్టీల్ సిటీ తరహాలో అభివృద్ధి చెందుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు.
ఇక ఈ సందర్భంగా జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు మంచి మిత్రులని, అప్పట్లో ఆయన ఏపీకి సంబంధించిన అనేది విషయాలు తనతో పంచుకునేవారని గుర్తుచేసుకున్నారు. ఆయన తదనంతరం సీఎం జగన్తో కూడా సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయని, వైఎస్సార్ చూపిన బాటలోనే జగన్ నడుస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ స్టీల్ ప్లాంటును దేశంలోనే అగ్రగామి సంస్థల్లో ఒకటిగా నిలిపేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. సంవత్సరానికి మూడు మిలియన్ టన్నుల సామర్థ్యంతో ప్లాంట్లో పనులు వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని, అలాగే ప్లాంట్ నిర్మాణం ద్వారా దాదాపు 25,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
కాగా 2019 డిసెంబర్ 23న సున్నపురాళ్ల పల్లె గ్రామంలో సీఎం జగన్ ఏపీహెచ్ఎస్ఎల్కు శంకుస్థాపన చేశారు. అయితే ఆ తర్వాత ఈ ప్రాజెక్టులోకి జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఎంటరైంది. కాగా జేఎస్డబ్ల్యూ గ్రూప్ ప్లాంట్ నిర్మాణానికి ముడిసరుకు వనరులకు సమీపంలోని ప్రధాన ఆటో మరియు పారిశ్రామిక కేంద్రాలకు యాక్సెస్తో పాటు రోడ్డు, రైలు, సముద్రం మరియు వాయు మార్గాల ద్వారా కనెక్టివిటీ ఉండటంతో ఇక్కడ ఏర్పాటుకు కంపెనీ సంసిద్ధత తెలిపింది. కాగా రాష్ట్ర ప్రభత్వం ఈ ప్లాంట్ నిర్మాణానికి దాదాపు రూ. 700 కోట్ల నిధులను వెచ్చించి మౌలిక వసతులను కల్పిస్తోంది. ప్లాంటును జాతీయ రహదారికి అనుసంధానిస్తూ 7.5 కి.మీ అప్రోచ్ రోడ్డును నిర్మిస్తోంది. అలాగే ప్రొద్దుటూరు-ఎర్రగుంట్ల రైల్వే లైనుకు కలుపుతూ 10 కి.మీ మేర కొత్త రైల్వే లైను ఏర్పాటు చేస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE