ఇటీవలే భారతజట్టు, వెస్టిండీస్ పై టెస్టు సిరీస్ ను క్లీన్స్వీప్ చేసి సత్తా చాటింది. ఇక సొంతగడ్డపై ముందుగా డికాక్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టుతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో తలపడటానికి ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 15 నుంచి టి-20 సిరీస్ మొదలవుతుంది, 15న ధర్మశాల, 18న మొహాలీ, 22న బెంగుళూరులో ఈ మ్యాచులను నిర్వహిస్తున్నారు. ఈ టీ20 సిరీస్ కు కొన్ని రోజుల క్రితమే 15 మంది ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ప్రకటించింది. టి-20 ల అనంతరం దక్షిణాఫ్రికా-భారత్ ల మధ్య మూడు టెస్టు మ్యాచుల సిరీస్ జరగనుంది. ఈ టెస్టు సిరీస్ కు ఎమ్మెస్కె ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 ఆటగాళ్లతో కూడిన జాబితాను గురువారం నాడు ప్రకటించనున్నారు.
జట్టులో స్థానం కోసం రోహిత్ శర్మ ఎదురుచూస్తుండగా, ఇటీవల అంతగా రాణించని కేఎల్ రాహుల్ పైనే అందరి దృష్టి నెలకొని ఉంది. ఓపెనర్ గా విఫలమవుతుండంతో రాహుల్ పై వేటు వేసే ఛాన్స్ యే ఎక్కువుగా ఉందని భావిస్తున్నారు. వెస్టిండీస్ పర్యటనలో రోహిత్ శర్మ జట్టులో ఉన్నా కూడ ఆడే అవకాశం రాలేదు, రోహిత్ శర్మకు టెస్టు జట్టులో సుస్థిరంగా స్థానం కల్పించాలని మాజీ ఆటగాళ్లు పదేపదే కోరుతున్నారు. మరోవైపు శుబ్ మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, ప్రియాంక్ పంచల్ లాంటి ఆటగాళ్లు జట్టులో స్థానంకోసం ఎదురుచూస్తున్నారు. ఇక 3,4,5,6 స్థానాల్లో ఛతేశ్వర పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, హనుమ విహారి రాణిస్తుండడంతో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు. వికెట్ కీపర్ స్థానానికి సాహా, రిషబ్ పంత్ లను కొనసాగించే అవకాశం ఉంది. పూర్తిగా పిట్ నెస్ సాధించకపోవడం వలన భువనేశ్వర్ కుమార్ జట్టుకు దూరం కావచ్చు. వెస్టిండీస్ పర్యటనకు దూరంగా ఉన్న ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్ళీ టెస్టు జట్టులోకి పునరాగమనం చేయబోతున్నాడు. రవీంద్ర జడేజా, అశ్విన్, కుల్ దీప్ ముగ్గురు స్పిన్నర్లు జట్టుకి అందుబాటులో ఉంటారు.